Thursday, 3 September 2026

సైబర్ నేరంలో... భారీ రికవరీ

*సైబర్ నేరంలో అప్రమత్తతతో స్పందించి రూ.2,22,054 మొత్తాన్ని రెండు రోజుల్లో రికవరీ చేసిన చిత్తూరు జిల్లా సైబర్ సెల్ పోలీసులు*

*సైబర్ నేరం జరిగిన వెంటనే బాధితుడు అప్రమత్తమై సకాలంలో ఫిర్యాదు చేయడం ద్వారా భారీ మొత్తాన్ని తిరిగి పొందవచ్చని నిరూపించిన చిత్తూరు జిల్లా పోలీసులు.*

*“సైబర్ మోసానికి గురైతే భయపడకండి… ఆలస్యం చేయకండి… వెంటనే 1930కు కాల్ చేయండి.”*

“Golden Hourను మిస్ కాకండి… మీ డబ్బును కాపాడుకునేందుకు వెంటనే స్పందించండి.”

“మీ అప్రమత్తతే… మీ ఆన్‌లైన్ భద్రతకు తొలి అడుగు.”

జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 


సోమల గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి “ట్రాక్టర్‌కు ₹1,000 ఫైన్ పడింది” అంటూ ఒక అపరిచిత మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న లింక్‌ను ఓపెన్ చేయగా, ‘mParivahan’ పేరుతో నకిలీ యాప్ అతని ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయింది. అనంతరం కొద్దిసేపటికే ఆయన ICICI క్రెడిట్ కార్డు నుంచి రూ.2,22,054 అనధికారికంగా డెబిట్ అయ్యాయి.


వెంటనే అప్రమత్తమైన బాధితుడు ICICI కస్టమర్ కేర్‌ను సంప్రదించడంతో పాటు 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న చిత్తూరు జిల్లా సైబర్ సెల్ పోలీసులు తక్షణమే స్పందించి, సంబంధిత బ్యాంకింగ్ లావాదేవీలను నిలిపివేయడంతో పాటు నగదు రికవరీ కోసం వేగవంతమైన చర్యలు చేపట్టారు.


పోలీసుల తక్షణ స్పందనతో పాటు బాధితుడు సకాలంలో ఫిర్యాదు చేయడంతో కేవలం రెండు రోజుల్లోనే పోగొట్టుకున్న పూర్తి మొత్తం రూ.2,22,054ను రికవరీ చేసి బాధితుడికి తిరిగి అందించారు.


తనకు జరిగిన సైబర్ మోసంపై చిత్తూరు జిల్లా సైబర్ సెల్ పోలీసులు వెంటనే స్పందించి, తన డబ్బును తిరిగి పొందేలా చర్యలు తీసుకున్నందుకు బాధితుడు చిత్తూరు జిల్లా పోలీసులకు మరియు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.


జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి మాట్లాడుతూ సైబర్ నేరాల్లో ప్రతి సెకను ఎంతో కీలకం. సైబర్ మోసానికి గురైన వెంటనే బాధితులు ఆందోళనకు గురికాకుండా, ఎటువంటి ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలి అన్నారు.


- “సైబర్ నేరంలో Golden Hourలో ఫిర్యాదు చేయడం అత్యంత కీలకం. మోసగాళ్ల ఖాతాల్లోకి నగదు బదిలీ అయిన వెంటనే ఫిర్యాదు చేస్తే, ఆ మొత్తాన్ని ఫ్రీజ్ చేసి బాధితుడి డబ్బును తిరిగి పొందే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.”


- “అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్‌లు, లింకులు, APK ఫైళ్లు లేదా అనుమానాస్పద యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయడం లేదా ఇన్‌స్టాల్ చేయడం చేయవద్దు. అధికారిక సంస్థల పేరుతో వచ్చిన సందేశాలను సైతం ముందుగా ధృవీకరించుకున్న తర్వాతే స్పందించాలి.”


- “ప్రజల అప్రమత్తతే సైబర్ నేరాల నివారణలో మొదటి రక్షణ. ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ లావాదేవీలు, పేమెంట్లు మరియు వ్యక్తిగత సమాచార రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.”


జిల్లా ఎస్పీ  సైబర్ క్రైమ్ అధికారులను, సిబ్బందిని అభినందిస్తూ, సైబర్ నేరాలకు గురైన బాధితులకు సత్వర సహాయం అందించి, నగదు రికవరీ కోసం సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.


*ప్రజలకు చిత్తూరు జిల్లా పోలీసుల విజ్ఞప్తి*


• అపరిచిత లింకులను ఓపెన్ చేయవద్దు.


• తెలియని APK ఫైళ్లు లేదా అనుమానాస్పద యాప్‌లను ఇన్‌స్టాల్ చేయవద్దు.


• బ్యాంకు/క్రెడిట్ కార్డు వివరాలు, OTP, PIN, CVV వంటి కీలక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు.


• సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు కాల్ చేయండి.


• సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ సెల్‌లో వెంటనే ఫిర్యాదు చేయండి.


• సైబర్ మోసం జరిగిన వెంటనే Golden Hourలో ఫిర్యాదు చేయడం ద్వారా నగదు రికవరీ అవకాశాలను పెంచుకోవచ్చు.


ఏదైనా ఆన్‌లైన్ మోసానికి గురైనట్లు అనిపించిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని జిల్లా పోలీసులు సూచించారు. అలాగే [www.cybercrime.gov.in](http://www.cybercrime.gov.in) పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయడంతో పాటు, సమీపంలోని సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలని ప్రజలకు సూచించారు.

No comments:

Post a Comment