మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ చిన్న పెద్దయ్య
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగసముద్రం గ్రామంలో మహిళలకు వివిధ భద్రతా అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ చిన్న పెద్దయ్య చిత్తూరు 2 టౌన్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య తో కలిసి మహిళలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సమయంలో ఎటువంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా లేదా గురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
అలాగే మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాల నివారణ, వేధింపులు, బాలల భద్రత, గృహ హింస తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలు తమకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులను నమ్మవద్దని, OTPలు, PINలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని తెలిపారు.
అదేవిధంగా మాదకద్రవ్యాలు, గంజాయి వంటి నిషేధిత పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తమ పరిసరాల్లో ఎవరైనా మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగానికి పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో డయల్-112, మహిళల సహాయం కోసం 181, బాలల సహాయం కోసం 1098, సైబర్ నేరాల కోసం 1930 హెల్ప్లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.
మహిళలు, చిన్నారుల భద్రతతో పాటు నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, పోలీసులకు సమాచారం అందించడం ద్వారా సురక్షిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఇన్స్పెక్టర్ చిన్న పెద్దయ్య తెలిపారు.

No comments:
Post a Comment