చిత్తూరు పట్టణములోని 1 టౌన్, 2 టౌన్ పరిధుల్లో గల లాడ్జీలపై విస్తృత తనిఖీలు.
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చిత్తూరు 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో లాడ్జీలపై సంబంధిత ఎస్ఐలు, పోలీసు సిబ్బంది గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ ప్రత్యేక తనిఖీలలో భాగంగా లాడ్జీల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, లాడ్జీల్లో బస చేస్తున్న అతిథుల నమోదు విధానం, వారి గుర్తింపు పత్రాలు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు , లైటింగ్ సదుపాయాలను పోలీసులు పరిశీలించారు.
లాడ్జీలలో ఎటువంటి అక్రమ కార్యకలాపాలకు అవకాశం లేకుండా చూడటం, మత్తు పదార్థాల వినియోగం మరియు అక్రమ రవాణాను అడ్డుకోవడం, మహిళలు మరియు ప్రయాణికుల భద్రతను కాపాడటం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.
తనిఖీల సందర్భంగా లాడ్జీ యజమానులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి లాడ్జీలో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని సూచించారు. లాడ్జీలో బస చేసే ప్రతి అతిథి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయడంతో పాటు, వారి గుర్తింపు పత్రాలను పరిశీలించి భద్రపరచాలని ఆదేశించారు.
అదేవిధంగా మద్యం సేవించడం, మత్తు పదార్థాల వినియోగం, జూదం మరియు ఇతర అక్రమ కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించే లాడ్జీ యజమానులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజల భద్రతకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


No comments:
Post a Comment